
– ఆల్ ఇండియా PHPS ప్రజా సేన హక్కుల పోరాట సమితి డిమాండ్
తాడిపత్రి, మే 25 (జనస్వరం) : సంతానలేమితో బాధపడుతున్న దంపతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఉచిత ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా PHPS ప్రజా సేన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్ డిమాండ్ చేశారు. మూడవ, నాల్గవ సంతానానికి ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం, పిల్లలు లేని దంపతుల సమస్యలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తదితరులకు వినతిపత్రాలు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మన్నెపాకుల మాధవ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఐవీఎఫ్ చికిత్సకు ఒక్కో ప్రయత్నానికి రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతోందని, ఇది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారిందన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత ఐవీఎఫ్/ఏఆర్టీ కేంద్రాలు ఏర్పాటు చేసి, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో ఐవీఎఫ్ చికిత్సను చేర్చాలని కోరారు. అర్హులైన దంపతులకు సంవత్సరానికి రెండు ప్రయత్నాల వరకు పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి, వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ సౌకర్యం కల్పించాలని సూచించారు. సుప్రీంకోర్టు పునరుత్పత్తి హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిందని, తమిళనాడులో ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత ఐవీఎఫ్ సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. “పిల్లలు పుడితేనే ప్రోత్సాహకాలు కాదు… పిల్లలు పుట్టేందుకు ప్రభుత్వ సహాయం కూడా అవసరం” అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా PHPS నగర అధ్యక్షులు జగదీష్ నాయుడు, మైనార్టీ ఇన్చార్జ్ బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.








