గ్రంథాలయ కార్యదర్శికి సత్కారం

అనంతపురము, జూన్ 18 (జనస్వరం):
జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జె. శివప్రసాద్‌ను పలువురు కవులు, రచయితలు గురువారం ఆత్మీయంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఏపీ గ్రంథాలయ పరిషత్ పూర్వ సభ్యులు, ప్రముఖ కవి గుత్తా హరి సర్వోత్తమ నాయుడు ఆధ్వర్యంలో కవులు, సాహితీవేత్తలు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలుగా, పాఠకులకు మార్గదర్శక కేంద్రాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో సాహిత్యాభివృద్ధికి, పఠన సంస్కృతి విస్తరణకు గ్రంథాలయాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లాలోని కవులు, రచయితలు, యువ సాహితీవేత్తలను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రంథాలయాల ద్వారా సాహిత్య చర్చావేదికలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, పఠనోత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయ సేవలను మరింత విస్తరించి యువతలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దీనికి స్పందించిన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జె. శివప్రసాద్ మాట్లాడుతూ, గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులకు మెరుగైన సేవలు అందించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ కవులు, రచయితల సహకారంతో పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రంథాలయాలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని, సాహిత్య రంగానికి గ్రంథాలయ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కవులు, రచయితలు సంస్థ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, కవులు, పాఠకులు పాల్గొని జె. శివప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

See also  అచ్చెన్నాయుడు గారిని కలసిన పుట్టపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శివప్రసాద్