
– ప్రధాని మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా లకు కృతజ్ఞతలు తెలియజేసిన మన్నల సుబ్రమణ్యం
అనంతపురం, మార్చి 17, (జనస్వరం) : రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) సంస్థకు కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యూవల్ మంజూరు చేయడంతో అనంతపురం జిల్లాలో ఆనందం వెల్లివిరిసింది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన విదేశీ నిధుల అనుమతులు మళ్లీ పునరుద్ధరించబడటంతో RDT సేవలు తిరిగి పూర్తి స్థాయిలో కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా మాదిగ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాకే రామతీర్థ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మన్నల సుబ్రమణ్యం మాట్లాడుతూ ఈ నిర్ణయం ప్రజల అవిశ్రాంత పోరాటానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. RDTపై ఏర్పడిన అనిశ్చితి తొలగిపోవడంతో వేలాది మంది పేదలు, రైతులు, విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త ఆశలు చిగురించాయని అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ విజయం ఒకేరోజులో సాధ్యపడలేదని, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీల సమిష్టి కృషి, నిరంతర ఉద్యమాల ఫలితమని తెలిపారు. గల్లీ స్థాయి నుంచి ప్రారంభమైన ఉద్యమాలు, గ్రామ గ్రామాల నుండి పోస్ట్ కార్డు ఉద్యమం ఢిల్లీ స్థాయికి చేరుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం స్పందించి FCRA రెన్యూవల్ మంజూరు చేసిందన్నారు. RDT సంస్థ తిరిగి సేవలు అందించేందుకు మార్గం సుగమం కావడంతో జిల్లా ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా పోరాటంలో భాగమైన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య మరియు జిల్లా ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాదిగ సంక్షేమ సేవా సంఘం నాయకులు సి. శంకరయ్య, సి. నాగరాజ, కోటంక మల్లేష్, చంటి, రాణా ప్రతాప్ లు కూడా ఆర్డీటీకి FCRA రెన్యూవల్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.








