
గుంతకల్, అక్టోబర్ 28, (జనస్వరం) : గుంతకల్ పట్టణంలో ప్రముఖ పురాతన శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు జిల్లా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, గుంతకల్ ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి, పత్తి హిమబిందు, బిజెపి నాయకుడు హరిహరనాథ్, జనసేన పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్గా మిట్ట లోకేంద్ర, జనసేన పార్టీ తరఫున ధర్మకర్తల మండలి సభ్యురాలిగా బోయ సుంకమ్మతో పాటు కూటమి తరపున మరొక ఆరు మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ మాట్లాడుతూ, స్థానిక శాసనసభ్యుడు గుమ్మనూరు జయరాం నాయకత్వంలో సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని, గతంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలను అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి సనాతన ధర్మ పరిరక్షకుడిగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నారని, ఆయనకు అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో ధార్షికత కలిగిన నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శనంలో దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆలయ అభివృద్ధిలో ధర్మకర్తల కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలు అయిన జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









