మహిళా చైతన్యంతోనే సాధికారత : జస్టిస్ టి. రజని

జస్టిస్ టి. రజని

హైదరాబాద్, మార్చి 9 : పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు ఎదిగినపుడే మహిళా సాధికారత సాధ్యపడుతుందని ఆంధ్రప్రదేశ్ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి టి. రజని అన్నారు. భారతదేశంలో మహిళలపై వివక్షత, అసమానత, అణచివేతలు అధికంగా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమకు జరిగే అన్యాయాలను ఎదిరించాలన్నారు. ఉన్నత స్థానంలో మహిళల సంఖ్య తక్కువగా ఉందన్నారు. కొన్ని రంగాల్లో మాత్రం మహిళలదే అగ్రస్థానమని పేర్కొన్నారు. శంకరం ఫౌండేషన్, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ కవి ‘కళారత్న’ డా. బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో వివిధ రంగాల్లో విశిష్టసేవలందించిన 30 మంది మహిళలకు జాతీయ మహిళా లెజండరీ పురస్కారాలు, ఆదర్శమహిళా ఎక్సలెన్సి పురస్కారాలు అందజేశారు. అలాగే జస్టిస్ బి. చంద్రకుమార్ రాసిన శిర్డిసాయి సాహిత్యంపై సమీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకరం వేదిక అధ్యక్షులు యలవర్తి ధనలక్ష్మి, ప్రముఖ సైకాలజిస్టు యమునాపాటక్ తో పాటు కవులు డా. జెల్ది విద్యాధర్, పి. విజయలక్ష్మి పండిట్, వాసిరెడ్డి మల్లీశ్వరి డా. రాధాకుసుమ, డా. ఆరికపూడి రఘు, డా. కోగంటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ బి.చంద్రకుమార్ రచనలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా శంకరం ఫౌండేషన్ లోగో ను జస్టిస్ టి. రజని ఆవిష్కరించారు. స్వర్గీయ యలవర్తి రాజేంద్రప్రసాద్ స్ఫూర్తితో ఫౌండేషన్ ద్వారా కళా, సాహిత్య సేవారంగాల కార్యక్రమాలు విరివిగా చేపడతామని యలవర్తి ధనలక్ష్మి తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొ. యం. దేవకి, కమలకుమారి, విజయగోలి, జి. సుభాషిణి, సన్నిధానం లక్ష్మి, కోగంటి ఉషారాణి, పద్మావతి, అలేఖ్యలను ‘మహిళా లెజండరీ’ పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో జరిగిన కవిసమ్మేళనం ఆహుతులను విశేషంగా అలరించింది.

See also  తెలుగు వారి ఆత్మగౌరవంగా నిలిచిన తెలుగుదేశం పార్టీ