గూడెం గ్రామంలో విద్యుత్ సదుపాయాలు – ప్రజల ఆనంద వేడుకలు

రొంపల్లి, అక్టోబర్ 9, (జనస్వరం) : అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీకి చెందిన గూడెం గ్రామంలో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న విద్యుత్ సౌకర్యం నేడు అందడంతో గిరిజన కుటుంబాలు ఆనందోత్సవాల్లో మునిగిపోయాయి. గ్రామస్థులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ వేడుకలో పాల్గొన్నారు. విద్యుత్ మరియు తాగునీటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన జనసేన సేవాదళ్ ఇంచార్జ్, Socio Economic Research Foundation చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఈ గిరిజన ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్ర సమయంలో దగ్గరగా చూసినట్టు తెలిపారు. 2025 జూలై 23న ఈ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి, ప్రజలకు భరోసా ఇచ్చి, తాత్కాలిక అవసరాల కోసం సోలార్ విద్యుత్ దీపాలను అందించినట్టు గుర్తుచేశారు.

గ్రామ పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేయగా, వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి గూడెం గ్రామానికి విద్యుత్ స్తంభాలు, సోలార్ పలకలు, పవన విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి 80 లక్షల రూపాయలకు పైగా నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. నాలుగు నెలల్లో విద్యుత్ సౌకర్యం గ్రామానికి చేరడం గ్రామ ప్రజల్లో భారీ ఆనందాన్ని నింపింది. ఇక రాబోయే రోజుల్లో రహదారి సౌకర్యం, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి సదుపాయం, పాఠశాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు చేసిన విన్నపాలను పవన్ కళ్యాణ్‌కు అందించినట్టు పేర్కొన్నారు. గూడెం గ్రామాన్ని దత్తత తీసుకొని, గిరిజన కుటుంబాల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడం తమ లక్ష్యమని సతీష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సెక్రటరీ ఎర్నింటి రమేష్, రొంపల్లి పంచాయతీ జనసేన నాయకుడు కళ్యాణ్, గ్రామ పెద్దలు సింహాద్రి గమ్మెళ్ల అప్పలస్వామి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

See also  చక్కెర కర్మాగారం తెరిపించాలని జనసేన నేత పేడాడ రామ్మోహన్ డిమాండ్