
– చదరంగం ఏకాగ్రతను పెంచుతుంది
– ప్రారంభించిన జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ
నంద్యాల, మార్చి 29, జనస్వరం : జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో, ఎన్.ఆర్.జి. చెస్ అకాడమీ గౌరవ చైర్మన్ రాజేష్ సౌజన్యంతో ఆదివారం స్థానిక ఈపూరి శేషయ్య శెట్టి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియంలో 15 సంవత్సరాల లోపు బాల బాలికలకు వేర్వేరుగా జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ రిబ్బన్ కత్తిరించి టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం క్రీడ ఏకాగ్రతను పెంచుతుందని, తద్వారా చదువులో కూడా రాణించే అవకాశాలు అధికమవుతాయని తెలిపారు. మొబైల్ ఫోన్లు పిల్లలపై దుష్ప్రభావం చూపుతున్నాయని, వాటి నుంచి దృష్టి క్రీడలపై మళ్లిస్తే మేధో వికాసం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, కళలలో పాల్గొనడం వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని చెప్పారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ అలవడటమే కాకుండా గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఏర్పడుతుందని, చిన్న విషయాలకు కృంగిపోకుండా ఉండేందుకు క్రీడలు సహాయపడతాయని వివరించారు. క్రీడలలో నిరంతర సాధనే విజయానికి మూలమని పేర్కొన్నారు. జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు జూన్ నెలలో గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో జిల్లా తరపున పాల్గొంటారని తెలిపారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ప్రకటించిన తేదీల ప్రకారం జిల్లా జట్టు ఎంపిక టోర్నమెంట్లు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ కోశాధికారి అమిదేల జనార్ధన్, టోర్నమెంట్ కోఆర్డినేటర్ వెంకటరావు, టోర్నమెంట్ ఆర్బిటర్ సుజాత, 150 మంది క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.








