
– ఫెర్టిలైజర్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
డెంకాడ, మే 13 (జనస్వరం) : రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. గురువారం డెంకాడ మండలం చొల్లంగిపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె రైతులకు రాయితీపై పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు, ఫెర్టిలైజర్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. భూసారాన్ని పెంచడంలో పచ్చిరొట్ట ఎరువులు కీలక పాత్ర పోషిస్తాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫెర్టిలైజర్ కార్డుల ద్వారా రైతులకు పారదర్శకంగా ఎరువులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల అవసరాలను గుర్తించి సకాలంలో విత్తనాలు, కార్డులు అందజేయడం పట్ల గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్, టీడీపీ అధ్యక్షుడు పల్లె భాస్కరరావు, జొన్నాడ సొసైటీ చైర్మన్ భవిరిశెట్టి శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నాయకుడు కలిదిండి పాణిరాజు, జనసేన కో-ఆర్డినేటర్ పైల శంకరరావు, సిరికి అప్పారావు, తోటడి ప్రకాష్, గుడివాడ కిరణ్, తెలుగు గోవింద్, మహంతి చిన్నం నాయుడు, కొండాపు హరీష్, ఎన్డీయే నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.








