మాకొడికి పాఠశాలకు కానిస్టేబుల్ మారుతి ప్రసాద్ నెల జీతం విరాళం

మాకొడికి, ఫిబ్రవరి 12, (జనస్వరం) : పుట్టిన ఊరిపై మమకారం చాటుకుంటూ మాకొడికి గ్రామానికి చెందిన ఎం. మారుతి ప్రసాద్ తన గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ప్రస్తుతం అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన రూ.40,000 మొత్తాన్ని పాఠశాల మౌలిక వసతుల మెరుగుదల కోసం అందజేస్తానని తెలిపారు. చదువు నేర్పిన బడిపై కృతజ్ఞతతో తీసుకున్న ఈ నిర్ణయం గ్రామంలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి రత్నమ్మ గతంలో గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించారని, ఆమె నేర్పిన సేవాభావమే తనను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ సహాయం అందిస్తున్నానని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ ఉద్యోగి తన జీతాన్ని వెచ్చించడం ఆదర్శప్రాయమని గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.

See also  అనంతపురం జిల్లా జనసేనపార్టీ నాయకులు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు