
భీమిలి, (జనస్వరం) : వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, గతంలో పాదయాత్ర చేసిన ఈ సీఎం ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చే ధైర్యం చేయలేక, ఇంటికే పరిమితమవుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అధ్వాన్నమైన రోడ్లపై ప్రయాణించి యాక్సిడెంట్లకు గురై చనిపోతున్నాం.. మరమ్మతులు చేయండని ఒకవైపు ప్రజలు డిమాండ్ చేస్తుంటే… సీఎం జగన్ మాత్రం సినిమా టికెట్లు అమ్ముకోవడం, మటన్ షాపులు ఏర్పాటు చేయడంపై దృష్టిపెడుతున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో రోడ్ల దుస్థితిపై చర్చిస్తారని అందరూ అనుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా గెలుద్దామనే ప్రణాళికపై చర్చించడం ప్రజల దౌర్భగ్యమన్నారు. శనివారం భీమిలి నియోజకవర్గ జనసేన కార్యాలయంలో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు టి. శివ శంకర్, బొలిశెట్టి సత్య, శ్రీ పాలవలస యశస్వి, పీఏసీ సభ్యులు కోన తాతారావు, భీమిలి నియోజకవర్గ ఇంఛార్జు పంచకర్ల సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… “రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ కు కనివిని ఎరుగని తీరిలో స్పందన వచ్చింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు లక్షలాది మంది జనసైనికులు, వీర మహిళలు తమ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై మూడు రోజుల పాటు చేసిన ఈ కార్యక్రమం ఇండియాలోనే నెంబర్ వన్ గా ట్రెండింగ్ అయ్యింది. ఈ రెండేళ్లలో రోడ్ల మరమ్మతుల కోసం రూ.14 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించామని ప్రభుత్వం చెప్పడం ఒక అభూతకల్పన. ఇప్పటికైనా ప్రభుత్వం అనవసరమైన ఖర్చులను పక్కనపెట్టి ప్రజలకు అవసరమైన రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక రోడ్డును ఎంపిక చేసుకొని శ్రమదానం కార్యక్రమం ద్వారా రోడ్డు మరమ్మతు పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. రోడ్ల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు, మున్సిపల్ పన్నులు, చెత్త పన్ను, మహిళలను ఈ ప్రభుత్వం ఎలా మోసం చేస్తోందనే అంశాలపై పోరాటం చేయబోతున్నామని తెలిపారు.
మరో రెండు రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటన
కార్యకర్తల్లో ధైర్యం నింపి వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే విధంగా జనసేన పార్టీ బీమా పథకాన్ని తీసుకొచ్చిందని తెలియజేశారు. దేశంలో ఏ ఇతర పార్టీ కూడా కార్యకర్తల కోసం ఇలాంటి పాలసీ తీసుకురాలేదని తెలిపారు. దురదృష్టవశాత్తు భీమిలి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు జనసేన క్రియాశీలక సభ్యులు త్రినాధ్, ఈశ్వరరావులు ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాలను పరామర్శించాలని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇవాళ ఆ కుటుంబాలను పరామర్శించి రూ.5 లక్షల బీమా చెక్ లు అందించాం. పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతోందన్నారు. కేవలం రెండు నెలల్లోనే లక్షకుపైగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. కార్యకర్తల యోగక్షేమాలు, ప్రజా ప్రయోజనాల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆ క్రమంలోనే క్రియాశీలక కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమాను కల్పించారు. మరో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలోనే పర్యటిస్తామని తెలియజేశారు. రేపు విశాఖ జిల్లాలో ఉన్న స్థానిక సమస్యలపై అందరి నాయకులతో చర్చిస్తామన్నారు. 20వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళ్లి ఇటీవల మృతి చెందిన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శిస్తామని” చెప్పారు.









