
శ్రీకాళహస్తి, (జనస్వరం) : ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడానికి ప్రభుత్వం పూనుకోవడంపై చిత్తూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసారు. RTC బస్ స్టాండ్ నుండి విద్యుత్ సరఫరా కేంద్రం వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ ఏ డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి కొట్టే సాయి గారు మాట్లాడుతూ కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదాయాలు పడిపోయాయి జీవనమే కష్టంగా మారింది. ఈ స్థితిలో ప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాలి. పన్నులు రద్దు చెయ్యాలి. ఉపశమనం కల్పించాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి. వైద్య సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలి. కాని దానికి భిన్నంగా రాష్ట్రంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై పన్నుల భారాన్ని మోపారు. గత నాలుగు సంవత్సరాలుగా విద్యుత్ సంస్థకి నష్టాలు వచ్చాయని, ఆ నష్టాలను ప్రజల నుంచే వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, వసూళ్ళకు పూనుకోవడం అన్యాయమైన చర్య అని అన్నారు. అలాగే యూనిట్ ఛార్జ్ ఎంత పడితే అంతకి రెట్టింపు ట్రూ అప్ పేరుతో బిల్లులు వస్తున్నాయి . సామాన్యులకి, మధ్య తరగతి ప్రజలపై విపరీతంగా భారం పడింది. నష్టాలు రావడానికి ప్రజల కారణం కాదు, నష్టాలు రావడానికి ప్రభుత్వ విధానాలు కారణం. ఐనా ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన నష్టాలకి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం అనేది మరి అన్యాయమైన విషయం. ఈ రకంగా బిల్లులు వస్తుంటే ప్రజలు చెల్లించే స్థితిలో లేరు. కావున తక్షణమే పెంచిన ట్రూ అప్ ఛార్జీలను ఉపసంహరించి నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఒక వైపున ప్రజలు కరోన ప్రభావంతో ఆర్ధికంగా చితికి పోయి ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ప్రజల్ని అదుకోవడం పోయి ఇలా అన్ని పెంచుకుంటూ పోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని తెలియచేసారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు కుమార్, మాధవ మహేష్, మహిళా నాయకులు సునీత, విజయా జనసేన కార్యకర్తలు చిరంజీవి రాఘవ, సత్తార్ బాషా, లీల, షఫీ, బాలకృష్ణ, రఘు, మున్నా, ప్రమోద్, ప్రేమ్, శివ, నారాయణ, లక్ష్మీపతి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.









