
– జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కడియం ఎంపిక…
– తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్ జగన్మోహనరావు
కడియం, జూలై 23 (జనస్వరం): భూ మోసాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలాన్ని ‘మీ భూమి బ్లాక్చెయిన్’ పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం వల్ల భూ మోసాలకు చెక్ పడుతుందని జిల్లా రిజిస్ట్రార్ కాట్రగడ్డ జగన్మోహనరావు, కడియం తహసీల్దార్ శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన బ్లాక్చెయిన్ అత్యంత శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఉందన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖ, రెవెన్యూ, సబ్-రిజిస్ట్రార్, విద్యుత్, బ్యాంకింగ్ తదితర ఎనిమిది శాఖల వద్ద రైతుల భూములకు సంబంధించి సవివర సమాచారం ఉంటుందన్నారు. దీనివల్ల బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా పొందవచ్చన్నారు. వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. భూ యజమానులకు సులభతరమైన సేవలను అందుబాటులోకి తీసుకురావడమే బ్లాక్చెయిన్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఒక్కో ఎల్పీఎం నంబర్కు ప్రత్యేక భద్రత కల్పించడం జరుగుతుందని, ఈ విధానం ద్వారా వాస్తవమైన హక్కుదారునికి పూర్తి రక్షణ లభిస్తుందన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదని, ఒకరి భూమిపై మరొకరు రుణాలు పొందడం, ఒక బ్యాంకులో రుణం ఉండగానే మరో బ్యాంకులో రుణం తీసుకోవడం వంటి మోసాలకు తావుండదని వెల్లడించారు. ‘మీ భూమి బ్లాక్చెయిన్’పై అవగాహన పెంచుకుని ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని జగన్మోహనరావు కోరారు. ఇప్పటికే ఆటో మ్యుటేషన్ ద్వారా కొనుగోలుదారుడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయకుండానే ‘మీ భూమి’ యాప్లో హక్కుదారుని పేరు నమోదు అవుతుందన్నారు. ‘మీ భూమి బ్లాక్చెయిన్’ ద్వారా మరిన్ని సదుపాయాలు అమల్లోకి వస్తాయని తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె. రమేష్, కడియం సబ్-రిజిస్ట్రార్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








