
పాలకులకు విజ్ఞతను ప్రసాదించమని కోరుతూ భీమవరం జనసైనికులు వినూత్న నిరసన
రాష్ట్రవ్యాప్తంగా హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడులపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భీమవరం జనసైనికుల ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వేకాలనీలోగల అంబేద్కర్ విగ్రహానికి జనసైనికులు పూలమాల వేసి నివాళులర్పించి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలి గానీ సమాజంలో విద్వేషాలను, అశాంతిని రేకెత్తించేలా మాట్లాడడం తగదని, అలా మాట్లాడేవారికి మహనీయుడు అంబేద్కర్ గారు విజ్ఞతను ప్రసాదించాలని కోరారు. క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అనే తేడా లేకుండా సమాజంలో సోదరభావంతో మెలుగుతున్న ప్రజలమధ్య పాలకులు చిచ్చుపెట్టే వ్యాఖ్యలను చేయవద్దని అన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలపై జరిగే దాడులను ఖండిస్తున్నామని, మంత్రి కొడాలి నాని గారు మాట్లాడిన బాష చాలా అసభ్యకరంగా ఉందని, ఆ మాటలను వెంటనే తీసుకోవాలని అన్నారు. ఇలాంటి నాయకులు ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతున్న మన రాష్ట్రంలో ఆ రాజ్యాంగ పితామహుడు అంబేడ్కర్ గారు విజ్ఞానాన్ని ప్రసాదించమని కోరామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరి, బూరెడ్డి శ్రీను, తిరుమాని ఆంజనేయులు, తేజ , శివ, చక్రి మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.









