అచ్చుతాపురంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం: ప్రజా సంఘాలు

అచ్చుతాపురం, జూలై 24 (జనస్వరం): నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు న్యాయం చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అచ్చుతాపురంలో విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. అనంతరం ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు జి. కోటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు, డీవైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు కె. సోమునాయుడు మాట్లాడుతూ, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. సమస్యను పరిష్కరించకుండా ఢిల్లీ పోలీసులు నిరాహార దీక్షను భగ్నం చేయడం, విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం దుర్మార్గమని విమర్శించారు. అందుకే దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన, రైతు, ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు బంద్‌కు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కార్మికులు, విద్యార్థులు అచ్చుతాపురంలో బంద్‌ను విజయవంతం చేశారని తెలిపారు. నీట్ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కారణంగా పలువురు విద్యార్థులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ అంశంపై ఆమరణ దీక్ష కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా సమస్యను మరింత జటిలం చేస్తోందని విమర్శించారు. శాంతియుతంగా జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రభుత్వం స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె. ఉమాశంకర్, ఆర్. హేమంత్, ఎం. సాకత్ నాయుడు, కె. రాహుల్, మధు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

See also  అర్హులైన రైతులకు రైతు భరోసా సొమ్ము జమ కావడం లేదు తక్షణమే అర్హుల జాబితాలో చేర్చాలని నర్సీపట్నం జనసేన నాయకులు డిమాండ్.