కందుకూరు రైతులకు ఉద్యానపంటల సబ్సిడీ పథకాలపై అవగాహన కార్యక్రమం

అనంతపురం రూరల్, అక్టోబర్ 18, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ రైతుల కోసం ఉద్యానపంటల సాగు, పథకాలపై అవగాహన సదస్సును అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామంలోని మారెమ్మ గుడి వద్ద నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు స్ప్రేయర్లు, కొత్త మొక్కలు, క్రేట్లు వంటి అనేక సబ్సిడీ పథకాల వివరాలు తెలియజేశారు. మండల హార్టికల్చర్ ఆఫీసర్ రత్నకుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మినీ ట్రాక్టర్లను కూడా సబ్సిడీ కింద రైతులకు అందజేస్తామని వెల్లడించారు. రైతులు సాంప్రదాయ ఎరువుల వినియోగం పెంచుకోవాలని, ప్రయివేటు ఎరువుల వాడకంలో నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయని జాగ్రత్తలు సూచించారు. సబ్సిడీ పథకాల కోసం అవసరమైన ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, కుల సర్టిఫికెట్‌ను స్థానిక అగ్రికల్చర్ ఆఫీసర్ మల్లికార్జునకు అందజేయాలని సూచించారు.

 

ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధి మనోహర్ మాట్లాడుతూ తాము ఐదు రాష్టాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 36 లక్షల మొక్కలను రైతులకు ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. పర్యావరణ సంరక్షణ, బయోగ్యాస్ ప్రోత్సాహం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అవసరం ఉన్న రైతులకు మొక్కలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమం చివరలో రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు తెలిపి, పంటల అభివృద్ధికి అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు హార్టికల్చర్ అసిస్టెంట్ మల్లికార్జున, ఇటుకలపల్లి హార్టికల్చర్ అసిస్టెంట్ నలినాక్షి, ZBNF ప్రియాంక, మహిళా రైతులు, స్థానిక రైతులు, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న యువత పాల్గొన్నారు.

See also  సొంత నిధులతో కాలువ పూడికతీతకు శ్రీకారం చుట్టిన నలిశెట్టి శ్రీధర్