రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఆత్మకూరు జనసేన నాయకుడు నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష

రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఆత్మకూరు జనసేన నాయకుడు నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష

     ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు, సాగునీటి రంగంలోగాని, పారిశ్రామిక రంగంలోగాని, మౌలిక వసతుల కల్పన రంగంలోగాని, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అయితే నేమి, ఆత్మకూరు ప్రాంత ప్రజలు తీవ్ర వివక్షకు, నిర్లక్ష్యానికి గురైనారు. దశాబ్దాలుగా దగాపడ్డ ఆత్మకూరు ప్రాంత ప్రజల గొంతుకై జనసేన పార్టీ గళమెత్తింది. దశాబ్దాలుగా దగాపడ్డ యువత పిడికిలై జనసేన పోరుబాట పట్టింది. ఈ పోరాటంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షకు, జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికై జనసేన పార్టీ సుమారు 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించిన సంగతి అందరికీ విదితమే.

1) ఈ ప్రాంత రైతాంగం యొక్క అతిపెద్ద సమస్య, చుక్కల భూముల సమస్య. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఒక్కనెల్లూరు జిల్లా మినహా, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో, ఈ సమస్య, రైతుల అర్జీలతో నిమిత్తం లేకుండా సుమోటోగా పరిష్కారమైంది. నెల్లూరు జిల్లాలో మాత్రం, నేతలు మారినా రైతన్నల తలరాతలు మారలేదు. జిల్లా వ్యాప్తంగా, చుక్కల చిక్కుల్లో నలిగిపోతున్న 37,268 అన్నదాతల ఆక్రందనకు రూపమే, ఈ ఆమరణ నిరాహార దీక్ష.

2) నెల్లూరు జిల్లా వరప్రదాయని సోమశిల జలాశయం, ఆత్మకూరు నియోజకవర్గంలో ఉంది. ఈ జలాశయం నుండి నెల్లూరు జిల్లాలోని డెల్టా ప్రాంతానికి, పక్క జిల్లాలకు మరియు పక్క రాష్ట్రానికి సాగు తాగునీటి సరఫరా జరుగుతుంది. సోమశిల జలాశయం జలాలతో,మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గంలోని, అన్నీ చెరువులను నింపే ప్రణాళికను రూపొందించాలన్న, ఈ ప్రాంత రైతాంగం యొక్క చిరకాల ఆకాంక్ష సాధనకు రూపమే ఈ ఆమరణ నిరాహార దీక్ష.

3) శాస్త్ర,సాంకేతిక,యాంత్రిక పరిజ్ఞానం అంతగా లేని బ్రిటిష్ పాలనలో 1885 సంవత్సరములో, కేవలం ఆరు సంవత్సరాల కాలంలో సంగం ఆనకట్టను నిర్మించడం జరిగింది. శాస్త్ర, సాంకేతిక, యాంత్రిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న, నేటి రోజుల్లో పుష్కరకాలం క్రితం శంకుస్థాపన జరిగిన సంగం బ్యారేజీ నేటికీ నిర్మాణ దశలోనే ఉందంటే, ఈ ప్రాంత రైతాంగం పట్ల పాలకుల నిర్లక్ష్యం, ఏ స్థాయిలో ఉందో, చెప్పకనే చెబుతుంది. సంగం బ్యారేజీ త్వరగా పూర్తి చేయాలని, మరియు సంగం బ్యారేజీ బ్యాక్ వాటర్ నుండి ఆత్మకూరు నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాలకు సాగునీటి ప్రణాళికలను రూపొందించాలన్న, ఈ ప్రాంత రైతాంగం యొక్క ఆశల, ఆశయ సాధనకు రూపమే ఈ ఆమరణ నిరాహార దీక్ష.

See also  జనసేన కుటుంబ సభ్యునికి 55000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన బొలిశెట్టి

4) స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా ఆత్మకూరు నియోజకవర్గం లోని మెట్ట ప్రాంత, ఆయకట్టు కోసం రూపొందించబడిన మొట్టమొదటి సాగునీటి ప్రణాళిక, ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కెనాల్. దశాబ్ద కాలం క్రితం శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు, పాలకుల నిర్లక్ష్యం, నిధుల లేమి వెరసి పనులు పూర్తిగా నిలిచిపోయివున్నది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా తమ బతుకులు ఎప్పుడూ బాగుపడతాయా అని, ఆశతో ఎదురు చూస్తున్న మెట్ట ప్రాంత రైతాంగ చిరకాల స్వప్న సహకారానికి రూపమే, ఈ ఆమరణ నిరాహార దీక్ష.

5) ఈ ప్రాంత ప్రజలు మరియు రైతాంగం యొక్క ఐదు దశాబ్దాల కల, శ్రీకాళహస్తి – నడికుడి రైల్వే మార్గం. దశాబ్దాల పోరాట ఫలితంగా 2012లో ఈ రైల్వే నిర్మాణానికి సాంకేతిక అనుమతి లభించినప్పటికీ, 2018 వరకు నిధులు మంజూరు జరగలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందంలో భాగంగా ఈ రైల్వే నిర్మాణానికి అవసరమైన భూమిని మొత్తం, రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంది, మరియు ఈ రైల్వే నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చులో, సగం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తన వంతు నిధులను విడుదల చేసింది. ఆ నిధులతో అరకొర పనులు జరుగుతున్నాయి. జిల్లాలో మెట్ట ప్రాంతమైన, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో దోహద పడే ఈ ప్రాజెక్టుకు, నెల్లూరు జిల్లాలో నేటి వరకు ఒక్క సెంటు భూమిని కూడా సేకరించి, రైల్వేశాఖకు అప్పగించడం జరగలేదు. ఈ ప్రాంత అభివృద్ధి పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనం ఇది. ఆత్మకూరు ప్రాంత అభివృద్ధి కై ఎదురు చూసే ప్రజానీకం పోరాట రూపమే ఈ ఆమరణ నిరాహార దీక్ష.

6) నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధిని సాధించింది. అటు కిసాన్ సెజ్, కృష్ణపట్నం పోర్టు, మేనకూరు సెజ్, శ్రీ సిటీ సెజ్, శ్రీహరికోట రాకెట్ కేంద్రం, పదుల సంఖ్యలో నిర్మితమైన ధర్మల్ పవర్ స్టేషన్లు, కోస్టల్ కారిడార్ ఇలా నెల్లూరు జిల్లాలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి మొత్తం నెల్లూరు జిల్లా తూర్పు ప్రాంతం లోనే జరిగింది. చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ కూడా, మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గంలో ఏర్పాటు కాలేదు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే, ఈ ప్రాంత యువత యొక్క, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అన్న, యువతరం ఆశల ఆశయ సాధన రూపమే, ఈ ఆమరణ నిరాహార దీక్ష. ఈ ప్రాంత యువతరం, రైతాంగం, ప్రజానీకం యొక్క ఆకాంక్షల సాధనకు రూపమే ఈ ఆమరణ నిరాహార దీక్ష. ఈ ప్రాంత రైతాంగం, యువతరం, ప్రజానీకం కోసం అవసరమైతే ప్రాణార్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు శ్రీనివాసులు, జమ్మల ప్రసాదు,దాడి భాను కిరణ్, షేక్ వహీద్, కోటకొండ శీను, బండి అనిల్ రాయల్, గుమ్మలపాటి మదన్, ఆదర్శ్, పెంచలయ్యాచారి,సుబ్రహ్మణ్యం, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.

See also  లోకం మాధవి ఆధ్వర్యంలో యువ భరోసా కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి