
హైదరాబాద్, అక్టోబర్ 13, (జనస్వరం) : నలభై ఏళ్లు వచ్చిన తర్వాత మనిషి జీవితంలో సహజంగానే ఎన్నో మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వయస్సుకు వచ్చే సరికి మానసిక రుగ్మతలు లేకుంటే తరువాత వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అలాగే ఇప్పటి వరకు వ్యసనాలు అలవాటు కాకపోతే తరువాత వాటిని ఎంచుకునే అవకాశం కూడా తగ్గిపోతుంది.
దాంపత్య జీవితంలో ఈ వయస్సు నాటికి ఒకరికొకరిపై మంచి అవగాహన ఏర్పడుతుంది. పిల్లలు పెద్దవారై తమ పనులు తామే చేసుకునే దశకు వస్తారు. తల్లిదండ్రులతో బంధం మరింత కరగుతుంది. ఈ వయస్సులో అప్పులు, ఆస్తి విషయాలు, వాయిదాలు వంటి ఆర్థిక విషయాలు శ్రమగా కాకుండా అలవాటుగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త స్నేహాలు ఎక్కువగా రావు. పాత పరిచయాలు మాత్రం బలపడతాయి.
అసూయ, ఈర్ష్య వంటి భావాలు తగ్గుతాయి. చిన్నప్పటి హాబీలు మళ్లీ గుర్తుకు వస్తాయి. ఇప్పటివరకు చేసిన పనులపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. వచ్చే పదేళ్లను అదే పనిని మెరుగుపరచడానికి ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులు, బంధువులలో ఎవరికైనా సమస్యలు వస్తే “నాకు అలాంటి ఇబ్బందులు రాలేదు” అని కృతజ్ఞత భావం పెరుగుతుంది. రాజకీయాలు, స్నేహాలు, శత్రుత్వాలపై అభిప్రాయాలు స్పష్టమవుతాయి.
ఈ వయస్సులో వ్యక్తిగత లక్ష్యాలకంటే కుటుంబ లక్ష్యాలు ముఖ్యమవుతాయి. ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ, డాక్టర్ ఖర్చులను కూడా అవసరమైన వాటిగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.








