
కళ్యాణదుర్గం, డిసెంబర్ 4, (జనస్వరం) : కళ్యాణదుర్గం పట్టణంలోని నగరవనాన్ని కూటమి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరవనంలోని సదుపాయాలను, పార్కులోని హిల్ వ్యూ వరకు వెళ్లి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, ప్రజలు ట్రెక్కింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కళ్యాణదుర్గంలోనే ప్రకృతి సోయగాలను ఆస్వాదించుకోవడం అదృష్టమని తెలిపారు. ట్రెక్కింగ్ చేసే వారి సౌకర్యార్థం మట్టి రోడ్డును స్వయంగా వేయిస్తానని హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గం ప్రజలకు అందుబాటులో ఉండేలా అటవీశాఖ ఆధ్వర్యంలో నగరవనం పార్కును అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ పార్కును త్వరలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల శ్రీ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవాన్ని వర్చువల్గా నిర్వహించాలా లేక ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి నిర్వహించాలా అన్నది త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.ఈ తనిఖీ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, వీరమహిళలు, అధికారులు పాల్గొన్నారు.








