మంగళంపేట అటవీ ఆక్రమణపై చర్యలు వేగం, భూములు స్వాధీనం

చిత్తూరు, అక్టోబర్ 13, (జనస్వరం) : మంగళంపేట అటవీ భూముల ఆక్రమణపై పీసీసీఎఫ్ (హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.) పి.వి. చలపతిరావు కీలక వివరాలు వెల్లడించారు. 1968 గెజిట్‌ ప్రకారం మొత్తం 75.74 ఎకరాలకు పట్టాలు ఉండగా, అదనంగా 32.63 ఎకరాలను అక్రమంగా కలుపుకున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు.

ఆక్రమణకు గురైన అటవీ భూములను పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఈ కేసులో ఏ1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఏ2గా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఏ3గా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేర్లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఏపీ అటవీ చట్టం 1967, బి.ఎన్.ఎస్. సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు.

అక్రమంగా కలుపుకున్న భూములకు కంచె వేసి సాగు చేసి ఆదాయం పొందారని, చట్ట విరుద్ధంగా బోర్‌వెల్‌ తవ్వారని, సుమారు రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం జరిగినట్లు చలపతిరావు చెప్పారు. అడిగినప్పుడు ఆక్రమణకు సంబంధించి చట్టబద్ధ పత్రాలను ఎవ్వరూ సమర్పించలేకపోయారని కూడా వెల్లడించారు.

అటవీ భూములు ఆక్రమించిన ఎవరినీ వదిలే అవకాశం లేదని, వారికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ భూముల అన్యాక్రాంతంపై విచారణ కోసం రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అటవీ భూముల వివరాలను పారదర్శకంగా వెబ్‌సైట్లో ఉంచాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారని, సర్వే పూర్తయిన వెంటనే అన్ని వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పీసీసీఎఫ్ వెల్లడించారు.

See also  స్పందన, ఫోన్ ఫిర్యాదుల కార్యక్రమాలు వైసీపీకి ఓట్ల తొలగింపుకి ఉపయోగపడుతున్నాయి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి