
భోగాపురం, జనవరి 04, (జనస్వరం) : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే దిశగా మరో కీలక ముందడుగు పడింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వ్యాలిడేషన్ ఫ్లైట్ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఈ ఫ్లైట్తో రన్వే, భద్రతా వ్యవస్థలు, సిగ్నలింగ్ వంటి కీలక మౌలిక వసతుల పనితీరును పరీక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి పాల్గొన్నారు. అధికారుల సమక్షంలో ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానం ద్వారా ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించబడింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనల మేరకు రన్వే ప్రమాణాలు, లైటింగ్ వ్యవస్థలు, నావిగేషన్ సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, జీఎంఆర్ గ్రూప్ నాయకత్వం ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల నెల్లిమర్ల నియోజకవర్గంతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ముఖచిత్రం మారుతుందని అన్నారు. పరిశ్రమలు, పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు ప్రస్తుతం 90 శాతానికి పైగా పూర్తయ్యాయని, నిర్ణీత గడువుకు ముందే అత్యున్నత ప్రమాణాలతో విమానాశ్రయాన్ని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు. ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం కావడంతో భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి మరింత చేరువైనట్లు అధికారులు స్పష్టం చేశారు.









