శ్రీ దామోదరం సంజీవయ్య గారి ఇంటిని స్మారకంగా మలుస్తాం : జనసేనాని పవన్ కళ్యాణ్

దామోదరం సంజీవయ్య

* రూ.కోటితో నిధి ఏర్పాటు

             న్యూస్ ( జనస్వరం ) : సమతావాదులు… ప్రజాసేవకులు నిత్యం స్మరించుకోవలసిన విలక్షణ నాయకుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి అణగారిన వర్గాల నేత. కడు పేద కుటుంబంలో జన్మించి. అసాధారణ వ్యక్తిగా ఎదిగిన కారుణ్యమూర్తి శ్రీ సంజీవయ్య గారు. సమకాలీన కుటిల నీతి కారణంగా రెండేళ్లకే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవలసి వచ్చినా… ఆ రెండేళ్ల కాలంలో ఆయన సాధించిన విజయాలు, ప్రజలకు అందించిన అపూర్వ సేవలు చిరస్మరణీయాలు. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో వెనుకబాటుతనం రూపుమాపడానికి బీజాలు వేశారు. శ్రీకాకుళంలో వంశధార ప్రాజెక్టు, రాయలసీమలో గాజులదిన్నె, వరదరాజులు ప్రాజెక్టులు ఆ అపర భగీరథుని సంకల్పంతోనే రూపుదిద్దుకున్నాయి. కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్ట్‌ కు అంకురార్పణ చేసినదీ శ్రీ సంజీవయ్య గారే. హైదరాబాద్‌ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో నిజాం నుంచి ప్రభుత్వపరమైన భూములలో 6 లక్షల ఎకరాలను దళితులు, వెనుకబడిన వర్గాలు, కార్మిక కర్షకులు, కుల వృత్తిదారులకు పంపిణీ చేసిన భూభాంధవుడు.. భవిష్య దార్శనికతలో ఆయనకు ఆయనే సాటి. కార్మికులకు బోనస్‌, చట్టాల సవరింపునకు లా కమిషన్‌, అవినీతి నిరోధక శాఖ, చర్మకారుల కోసం లిడ్‌ క్యాప్‌, ఊరూరా పారిశ్రామికవాడలు, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, భాగ్యనగరం భవిష్యత్తు కోసం హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ ను కలిపి మున్సిపల్‌ కార్పొరేషన్‌ గాను ఏర్పాటు చేసిందీ శ్రీ సంజీవయ్య గారే!

               ఆనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడడానికి స్వగ్రామం వెళ్లి ఆమెకు వంద రూపాయలు ఇవ్వగా…” నాకు బాగోకపోతే నువ్వు డబ్బులు ఇచ్చావు. మరి డబ్బులు లేని తల్లులకు ఎవరిస్తారు” అన్న తల్లి మాటలకు చలించిపోయి వృద్దులు, వికలాంగులకు పెన్షన్‌ పథకాన్ని శ్రీ సంజీవయ్య ప్రారంభించి తల్లి మాటలకు ఒక ఫలితాన్ని అందించారు. కవి, రచయిత అయిన శ్రీ సంజీవయ్య గారు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో అనర్గళంగా ఉపన్యసించేవారు. ముఖ్యంగా మాతృ భాపైన తెలుగుపై ఆయనకు మక్కువ ఎక్కువ. అందువల్లే ప్రభుత్వ కార్యాలయాలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరపాలని నిర్దేశించి అమలు చేశారు.

               అర్ధ శతాబ్దం కిందటే ఆయన కులాల మధ్య సయోధ్యను సాధించారు. సామాజికంగా వెనుకబడిన బోయలు, కాపు-తెలగ-బలిజ-ఒంటరి ఇతర అనుబంధ కాపు కులాలను వెనుకబడిన జాబితాలో చేర్చి వారి అభ్యున్నతికి పాటుపడ్డారు. ఇవన్నీ కేవలం రెండేళ్ల ఆయన పాలనా కాలంలో ఆచరించి చూపారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన అణగారిన వర్గాలకు చెందిన తొలి నాయకుడిగా కీర్తిగాంచారు. అంతటి మహానుభావుడు జీవిత చరమాంకంలో అతి సాధారణంగా బతికారు. ఆయన పరమపదించేనాటికి ఆయనకున్న ఆస్తులు 17 వేల రూపాయల నగదు. ఒక పాత ఫియట్‌ కారు. అదే మరి ఇప్పటి నాయకులైతే..? అందుకే శ్రీ సంజీవయ్య గారిని ‘నిత్య స్మరణీయుడు’గా భావిస్తున్నాను. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మలచడానికి జనసేన పక్షాన సంకల్పించాము. ఇందుకోసం ఒక కోటి రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని వినమ్రంగా తెలియచేస్తున్నాను.

See also  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్బంగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించిన జనసేన నాయకులు లోపింటి కళ్యాణ్