ధాన్య సేకరణలో ఎక్కడ జాప్యం జరగకూడదు: మంత్రి నాదెండ్ల మనోహర్

  • ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చొరవతో ధాన్యం కల్లాలను స్వయంగా పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్
  • ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు
  • 22 శాతం వరకు తేమ ఉన్నా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు
  • ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులకు మొబైల్ డ్రైయర్లు అందచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు
  • గోనె సంచుల సరఫరా, ధాన్యం రవాణా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు
  • రైతులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో ఉందని తెలిపారు

కోవూరు, మార్చి 30 (జనస్వరం) : రైతన్నను అన్ని విధాలా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి మేరకు మండలంలోని లేగుంటపాడు గ్రామంలోని ధాన్యం కల్లాలను మంత్రి స్వయంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన మంత్రి, రైతులతో నేరుగా మాట్లాడి అధికారుల పనితీరు, మిల్లర్ల సహకారంపై ఆరా తీశారు. ధాన్యం సేకరణలో తాము ఎదుర్కొంటున్న గోనె సంచుల కొరత, ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీల కొరత వంటి ప్రధాన సమస్యలను రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ ఇకపై గోనె సంచుల కొరత ఉండదని, రైతులకు సరిపడా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు తమకు నచ్చిన ఏ మిల్లుకైనా ధాన్యాన్ని తరలించుకోవచ్చని సూచించారు. 22 శాతం వరకు తేమ ఉన్నా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ధాన్యం ఆరబెట్టుకోవడంలో ఇబ్బందులు కలగకుండా రైతులకు మొబైల్ డ్రైయర్లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రైతులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో ఉందని, ధాన్య సేకరణలో ఎక్కడా జాప్యం జరగకూడదని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, డెల్టా రైతులు పడుతున్న ఇబ్బందులను మంత్రికి చెప్పగానే ఆయన స్పందించడం సంతోషకరమన్నారు. తన విజ్ఞప్తి మేరకు స్వయంగా కల్లాల వద్దకు వచ్చి రైతులకు ధైర్యం చెప్పిన మంత్రికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, జనసేన పార్టీ ఐటీ విభాగం కోఆర్డినేటర్ నక్కా శివకృష్ణ, జనసేన పార్టీ పీఓసీ చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా మార్కెటింగ్, పౌరసరఫర, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

See also  ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భీమ్లా నాయక్ చిత్రం విడుదల వేడుకలు : జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్