
అనంతపురం, మార్చి 17, (జనస్వరం) : గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ అహుడా చైర్మన్ టి.సి. వరుణ్ను అనంతపురంలోని అహుడా ప్రభుత్వ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సూచనల మేరకు పామిడి, గుత్తి, గుంతకల్ మండలాల్లో పంచాయతీల పరిధిలో కాలువలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమగ్ర నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో గుంతకల్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా రెండు మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ మౌలిక వసతులు సరిగా లేవని తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్ కోసం రాబోయే రోజుల్లో భారీగా నిధులు విడుదల చేయాలని అహుడా చైర్మన్ను కోరినట్లు తెలిపారు. దీనికి టి.సి. వరుణ్ సానుకూలంగా స్పందించి పంచాయతీరాజ్ శాఖ మరియు అహుడా ద్వారా త్వరలోనే నిధుల విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు.








