కూచిపూడి కళాకేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా రంగ ప్రవేశం

– చిన్నారి శ్రీరామ్ రిది అద్భుత నృత్య ప్రదర్శనకు ప్రశంసల వర్షం

– తిల్లానా, శంకర్ చక్ర తిల్లానాలతో మంత్రముగ్ధులైన ప్రేక్షకులు

అనంతపురం, ఫిబ్రవరి 24, (జనస్వరం) : కూచిపూడి కళాకేంద్రం ఆధ్వర్యంలో యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన రంగప్రవేశం కార్యక్రమం సాంస్కృతిక వైభవంగా జరిగింది. సాంప్రదాయ కళల మహిమాన్వితతను చాటిచెప్పే ఈ వేడుకకు కళాభిమానులు, తల్లిదండ్రులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా సహజ కవి ఏలూరు ఇంగన్న, కాలానిధి అమ్ముల భగవతార పాల్గొని చిన్నారి ప్రతిభను అభినందించారు. భారతీయ శాస్త్రీయ నృత్య కళలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా‌కు చెందిన 11 ఏళ్ల ప్రతిభావంతురాలు శ్రీరామ్ రిది తన అద్భుత నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తిల్లానా, శంకర్ చక్ర తిల్లానా, నీలామేఘా వంటి నృత్యాంశాలను లయబద్ధంగా, భావవ్యక్తీకరణతో సమర్పించి విశేష ప్రశంసలు అందుకుంది. ప్రతి అడుగులోనూ శాస్త్రీయ నైపుణ్యం ప్రతిఫలించడంతో ప్రేక్షకులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. కార్యక్రమం ముగింపులో అతిథులు శ్రీరామ్ రిధికి మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. గురువులు ఎన్. కృష్ణమూర్తి రాజు, తల్లిదండ్రులు శ్రీరామ్ సుబ్రమణ్య ప్రసాద్, కాకుమాని వినాతే తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రంగప్రవేశం కూచిపూడి కళాకేంద్రానికి గౌరవాన్ని తీసుకువచ్చిన వేడుకగా నిలిచింది.

See also  కళ్యాణదుర్గం జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశం