మహాశివరాత్రి ఏర్పాట్లపై పిఠాపురంలో అధికారుల సమీక్ష సమావేశం

పిఠాపురం, ఫిబ్రవరి 11, (జనస్వరం) : సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహాశివరాత్రి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం పిఠాపురం పాదగయ క్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కట్నం జగన్మోహన్ ఆధ్వర్యంలో, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు అధ్యక్షతన పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పాదగయ క్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి, పొరుగు జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారని తెలిపారు. వచ్చిన ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం సక్రమంగా కల్పించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్, కోనేరు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారం రోజులపాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఆంక్షలు అమలు చేయాలన్నారు. అలాగే వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల విషయంలో సమన్వయం పాటించాలని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు, మాజీ శాసన సభ్యులు పెండెం దొరబాబు, ఓదురి కిషోర్, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షురాలు రావుల వరలక్ష్మి, ఏపీ స్టేట్ డైరెక్టర్ కాంచర్ల భవానిశంకర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ బాలేపల్లి అనిల్, బీజేపీ కన్వీనర్ బుర్ర కృష్ణంరాజు, ఎండీఓ స్వప్న, చెల్లుబోయినా సతీష్, జోగా వెంకటరమణ, కొత్తం సుందర్, బొజ్జ లవరాజు, సూరవారపు సురేష్, కూరాకుల అరవింద్, మార్నిడి రంగబాబు, ఆగంటి ప్రభాకర్, బాలేపల్లి రాంబాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

See also  పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం