నెల్లూరులో సావిత్రిబాయ్ పూలే జయంతికి జనసేన ఘన నివాళులు

నెల్లూరు, జనవరి 3, (జనస్వరం) : భారత మహిళా ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు సావిత్రిబాయ్ పూలే జయంతి సందర్భంగా జనసేన పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. మహిళా విముక్తికి విద్యే మార్గమని నమ్మి, అనేక అవమానాలు, దాడులు ఎదుర్కొంటూ స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలిగా సావిత్రిబాయ్ పూలేను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, స్త్రీ విద్యకు ఆద్యురాలిగా నిలిచిన సావిత్రిబాయ్ పూలే జయంతి సందర్భంగా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల నేతృత్వంలో నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ వద్ద ఉన్న సావిత్రిబాయ్ పూలే విగ్రహానికి మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ, సావిత్రిబాయ్ పూలే మహిళా విముక్తికి మార్గదర్శకురాలని, సమాజంలో మహిళలకు విద్య అందించడమే లక్ష్యంగా ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. స్త్రీ విద్య లేకుండా సమాజ పురోగతి సాధ్యం కాదన్న ఆమె విశ్వాసమే నేటి సమాజానికి దిశానిర్దేశమని అన్నారు. నేడు మహిళలు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో ముందుకు రావడానికి ఆమె చేసిన త్యాగాలే బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. ఇంటిని చక్కదిద్దగల మహిళలు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాలన్న జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మహిళా సాధికారత, సమానత్వంపై చూపుతున్న విధానాలు సావిత్రిబాయ్ పూలే భావజాలాన్ని గుర్తు చేస్తాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నాగేంద్రబాలు, నరహరి, కృష్ణమోహన్ రెడ్డి, వర్షన్, కేవీఆర్ రమణ, వెంకటరమణ, హరి తదితరులు పాల్గొన్నారు.

See also  జెన్ కో ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాలంటూ JAC కి మద్దతు ప్రకటించిన నెల్లూరు జనసేన నాయకులు