రైతులకు లాభసాటి ధర రావాలన్నదే జనసేనాధిపతి ధ్యేయం : కొలసాని లక్ష్మి

రైతులకు లాభసాటి ధర రావాలన్నదే జనసేనాధిపతి ధ్యేయం : కొలసాని లక్ష్మి

             రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కాదు.. లాభసాటి ధర రావాలన్నదే జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ లక్ష్యం, ధ్యేయమని, దీనికోసం “జైకిసాన్” అనే కార్యక్రమ రూపకల్పనకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని జనసేనపార్టీ పర్చూరు నియోజకవర్గం నూతలపాడు జనసేన వీరమహిళ కొలసాని. లక్ష్మీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్లప్పుడూ అన్నదాతలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అనేక వ్యయ ప్రయాసలకోర్చి, ఆరుగాలం శ్రమించి, మనకు అన్నం పెట్టే అన్నదాతలు పండించిన పంటలు చేతికి అందివచ్చిన సమయంలో ప్రకృతివిపత్తుల మూలంగా అనేక సందర్భాలలో అపారమైన నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈనేపథ్యంలో భారతదేశ రెండవ ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తితో రైతుల అభ్యున్నతి కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ “జై కిసాన్” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారని ఆమె వివరించారు. రకరకాల వ్యవసాయ సంఘాలు, శాస్త్రవేత్తలతో చర్చించి, సంప్రదింపులు జరిపి తమ అధినేత ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారని లక్ష్మీ వెల్లడించారు. నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు పవన్ కళ్యాణ్ చేస్తూ… రైతులకష్టాలు కడగండ్లు స్వయంగా పరిశీలించి తెలుసుకుంటూ రైతులకు మనోస్థైర్యాన్ని నింపుతున్నారని ఆమె చెప్పారు.“తిరుపతికి వచ్చే ముందే రెండు తుపాన్లు రాబోతున్నాయని సమాచారం ఉన్నా… నష్టపోయిన రైతుకు భరోసా కల్పించేందుకు పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారంటే ఆయనకు రైతులందరి పట్ల గల పక్షపాతధోరణికి నిదర్శనమని, రైతులపై గల ప్రేమాభిమానాలకి తార్కాణమన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించిన అనంతరం, మేము సైతం జిల్లాస్థాయి, నియోజకవర్గ నాయకులతో కలసి క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరిపి పంట నష్టంపై నివేదిక తయారు చేస్తామని ఆమె అన్నారు. ఆ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించడంతో పాటు ప్రజలకు మేలు జరిగేలా కూడా తప్పకుండా పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని లక్ష్మీ తెలియజేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ప్రభుత్వం నుంచి ఎంతో కొంతసాయం అందుతుందనీ, కౌలు రైతులకు మాత్రం అలాంటి సాయం అందడం లేదని కొలసాని లక్ష్మీ వాపోయారు. కౌలు రైతులను కూడా విస్మరించకూడదని, కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోతే.. భవన నిర్మాణ కార్మికులకు జనసేనపార్టీ అండగా నిలిచిన విధంగా ప్రతికౌలు రైతుకూ న్యాయం జరిగే వరకు జనసేన శ్రేణులంతా అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు.

అన్నదాతను ఆదుకోవాల్సిందే…

లక్షలాది ఎకరాల్లో రైతులు పండించిన పంటలు అపారంగా నష్టపోతే రూ.5 వేలు, రూ.10 వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూడడం సరైనపద్దతి కాదన్నారు. ప్రభుత్వం దగ్గర చాలా నిధులు ఉన్నాయి. అన్నం పెట్టే రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 35 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారని, ఎకరాపంట వేయడానికి రూ.40 నుంచి రూ.50 వేలు పెట్టుబడి అవుతుందని రైతులు ఆయనకు చెప్పారన్నారు. అందుకే నష్టపరిహారం రూ. 35 వేలు ఇవ్వాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికే నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని, రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ముందస్తుగా పంట నష్ట పోయిన ప్రతిరైతుకు రూ. 10 వేలు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరికాదని కొలసాని లక్ష్మీ పేర్కొన్నారు.

See also  ఖమ్మం జిల్లాలో ఒక ఉన్మాది చేతిలో బలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 ఏళ్ల మైనర్ బాలికకు ఆర్థిక సహాయం