
నెల్లూరు,అక్టోబర్ 10, (జనస్వరం) : గంజాయి, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలపై పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు పెంచలయ్య కుటుంబానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొండంత ధైర్యంగా నిలిచారు. పెంచలయ్య పెద్దకర్మ సందర్భంగా ఆర్డిటి కాలనీ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పాల్గొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన జరిగిన 24 గంటలలోపే నిందితులను అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించారు. కుటుంబానికి ప్రత్యక్షంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, వారి కుమార్తెల చదువు బాధ్యతలను తానే తీసుకుంటానని ప్రకటించారు. ఈ నిర్ణయం స్థానిక ప్రజల్లో విశేష స్పందన తీసుకొచ్చింది. పెంచలయ్య స్మారకార్థంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఆర్డిటి కాలనీ అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయలతో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే ప్రకటించారు. మాటలకంటే చేతలే మిన్న అన్న విధంగా కుటుంబానికి అన్ని విధాల అండగా నిలిచిన తీరు ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, బిజెపి నాయకులు ఎర్రబోలు రాజేష్తో పాటు జనసేన పార్టీ, సిపిఎం పార్టీ, బిజెపికు చెందిన పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. పెంచలయ్య ఆశయాలను కొనసాగిస్తామని, అసాంఘిక శక్తులపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.









