
పుష్కరకాలువపై నాలుగడుగులు బ్రిడ్జికి బదులుగా పెద్దబ్రిడ్జిని నిర్మించాలి : పాటంశెట్టి సూర్యచంద్ర
జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నీలాద్రిరావు పేట పుష్కర కాలువపై 17 సంవత్సరాల క్రితం నిరుపయోగంగా నిర్మించిన నాలుగడుగుల బ్రిడ్జికి బదులుగా పెద్ద బ్రిడ్జిని నిర్మించాలని కాలనీ వాసులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక రోజు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర సతీసమేతంగా ముఖ్య అతిథిగా పాల్గొని చేపట్టారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ 17 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి పై ట్రాక్టర్, అంబులెన్స్, స్కూల్ బస్ కానీ, ఆటో గానీ వెళ్లని నాలుగడుగుల బ్రిడ్జి మాకెందుకని ఎన్నికలు వచ్చినపుడల్లా మీకు బ్రిడ్జి నిర్మిస్తామంటూ ఎన్నికల వాగ్దానాలు ఇవ్వడం, మళ్ళీ ఎన్నికల వరకూ ఈ బ్రిడ్జి గుర్తుకు రాకపోవడం పాలకుల నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుందన్నారు. గత ఎన్నికల ముందు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ నేతలు బ్రిడ్జి నిర్మిస్తామని శంకుస్థాపన చేశారని, ఇపుడు గెలిచిన అధికార వైయస్సార్ కాంగ్రెస్స్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రిడ్జి నిర్మించి, మంచి నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసి డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇక్కడికి పాపాన పోలేదని విమర్శించారు. ప్రజలతో నాడు ప్రజలకోసం నేడు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించకపోగా, ఒక కార్యకర్త ఇంటి దగ్గర టిఫిను, మరో కార్యకర్త ఇంటి దగ్గర భోజనం చేసి ప్రజా సమస్యలు గాలికొదిలేశారని దయ్యబట్టారు. ఈ బ్రిడ్జి సమస్య ఆరు నెలల్లో పూర్తి చేయకపోతే జనసేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామన్నారు. ఏడాది క్రితం జనసేన ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాధు చేసినా ఇప్పటి వరకూ పట్టించుకోలేదు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సూర్యచంద్ర సతీమణి శ్రీదేవి, గండేపల్లి మండల జనసేన అధ్యక్షుడు గోన శివ, ఉఫాధ్యక్షులు సోదసాని కామరాజు, రాయి మురళీ, దారబల్ల సద్గర గురుమూర్తి, దూది శ్రీను, ప్రతాప్ కుమార్, బోడిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండలం జనసేన అధ్యక్షులు పోలిశెట్టి సతీష్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగారాల మణిరత్నం, నీలాద్రిపేట జనసైనికులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








