
కళ్యాణదుర్గం, డిసెంబర్ 18, (జనస్వరం) : కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు 5జీ స్మార్ట్ ఫోన్లు, ప్రీ స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ బాల్యం రాజేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు గ్రామస్థాయిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పథకాలు, కిట్ల వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అంగన్వాడీలకు అందించే పోషకాహారం ఎక్కడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరేలా పనిచేయాలని సూచించారు. అంగన్వాడీల కృషి వల్లే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అలాగే ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించనున్న పోలియో చుక్కల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు, అంగన్వాడీ సిబ్బంది, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









