
హంసలదీవిని పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుతున్న జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్
ప్రముఖ న్యాయవాది జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ మాట్లాడుతూ సాధారణంగా హంసలదీవి పేరు ఇక్కడ హంసలు ఎక్కువగా తిరిగేవేమో అనుకోవడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ ఈ పేరు సంబంధిత కథనం ఒకటి ప్రచారంలో ఉంది అన్నారు.. ఈ క్షేత్రంలో కాకి హంసగా మారిన అద్భుత సంఘటన చోటు చేసుకుందిగనుకనే ఈ పేరు స్థిరపడింది అని చెప్పారు. అందరి పాపాలను కడిగేస్తూ వెళ్లిన కారణంగా గంగానది మలినమైపోయింది. దాంతో ఆమె తన దుస్థితిని శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకుంది. అప్పుడు విష్ణుమూర్తి గంగాదేవిని కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించమనీ, ఏ క్షేత్రంలో ఆమె హంసగా మారుతుందో అది మహోన్నతమైన దివ్యక్షేత్రమై అలరారుతుందని చెప్పాడు. ఆ క్షేత్ర మహిమ కారణంగా హంసగా మారాక తిరిగి ఎప్పటిలానే పవిత్రతతో ప్రవహించమని అన్నాడు. సకల పుణ్య తీర్థాలలో స్నానం చేస్తూ వెళుతోన్న కాకి కృష్ణవేణి సాగర సంగమం చేసే ఈ ప్రదేశంలో మునిగిలేవగానే హంసగా మారిపోయింది. అందుకే ఇది హంసలదీవిగా పిలువబడుతుందని స్థలపురాణం వివరిస్తుంది అని జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ పేర్కొన్నారు. కృష్ణా నది ఎక్కడో మహాబలేశ్వరంలో పుట్టి అనేక రాష్ట్రాలలో ప్రవహించి మన హంసలదీవి లో సముద్రంలో కలిసే అధ్బుతమైన ప్రదేశం మన నియోజకవర్గంలో ఉండటం గొప్ప విషయం అని ఆయన పేర్కొన్నారు. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న పుణ్యక్షేత్రం అభివృద్ధికి అమడదూరంలో ఉంది అని జనసేన నాయకులు రాయపూడి ఆవేదన వ్యక్తం చేశారు. కోడూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హంసలదీవిని టూరిజంగా అభివృద్ధి చెయ్యాలని జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.









