పేపర్ చోర్ ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి : ఎన్‌ఎస్‌యూఐ

– నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఒక వ్యవస్థీకృత కుట్ర
– విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన ఎన్‌టీఏను రద్దు చేయాలి
– నీట్ పేపర్ లీక్‌పై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి
– కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులు
– ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ యనమల

అనంతపురం, మే 13 (జనస్వరం) : దేశవ్యాప్తంగా మే 4వ తేదీన నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షను 20 లక్షలకు పైగా విద్యార్థులు రాశారని, ప్రస్తుతం పేపర్ లీకేజ్ ఘటన వెలుగులోకి రావడంతో పరీక్షను రద్దు చేయడం దురదృష్టకరమని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ యనమల అన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నరేష్ యనమల మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రెండు సంవత్సరాలు కష్టపడి సిద్ధమై వివిధ జిల్లాలకు వెళ్లి పరీక్ష రాసిన విద్యార్థుల ఆశలను కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం దెబ్బతీసిందన్నారు. గత సంవత్సరం హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో నీట్ పేపర్లు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అమ్ముడై లీక్ అయ్యాయని, ఈ సంవత్సరం కూడా అదే తరహాలో డబ్బుల కోసం పేపర్ లీక్ జరిగిందని ఆరోపించారు. ఎన్‌టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్ష గత కొన్నేళ్లలో రెండుసార్లు లీక్ కావడం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గతంలో రాష్ట్రాల వారీగా పరీక్షలు నిర్వహించినప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ఎన్‌టీఏ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి, పేపర్ లీకేజ్ ఘటనపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఓబీలేసు, అజయ్, నవీన్, శివాజీ, చరణ్, బి. సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.

See also  జాబ్ కాలెండర్ లో గ్రూప్-1,2 జాబ్స్ ఎక్కడ?- జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం యస్ కే యు అధ్యక్షులు జయంత్ వర్ధన్