
పెనుగొండ, మార్చి 31 (జనస్వరం) : స్థానిక పెనుగొండ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సర్వశెట్టి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ దేశంలో బలమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలే బీజేపీ సిద్ధాంతాలకు మూలమని, అంత్యోదయ లక్ష్యంతో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరేలా పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, పారదర్శక పాలనలో కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని, ప్రజలతో మమేకమై సేవ చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శిస్తూ, బీజేపీ కార్యకర్తలు నిజాయితీ, క్రమశిక్షణతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమాలు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు పార్టీ బలోపేతానికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోరంట్ల మోహన్ శేఖర్, మండల అధ్యక్షురాలు మమత, జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేష్, సీనియర్ నాయకులు వరప్రసాద్, వేదవ్యాస్, సోషల్ మీడియా ఇంచార్జ్ మేదర శ్రీనివాసులు, రామకృష్ణ, ముత్యాలమ్మ, హరీష్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.









