
– కలెక్టరేట్లో ధాన్య సేకరణకు సంబంధించి మిల్లర్లు, అధికారులతో మంత్రుల సమీక్ష
– తేమ శాతం పరీక్షించడంలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దాలి
– మిల్లర్ల ఎంపిక విషయంలో క్షేత్రస్థాయి అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి
– గోనె సంచులు, లారీల కొరత రాకుండా చూడాలి
– రబీ సీజన్ గడువు పెంచి రైతాంగానికి మేలు చేయాలి
నెల్లూరు, మార్చి 30 (జనస్వరం) : కోవూరు నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న ధాన్య సేకరణ ఇబ్బందులపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో జరిగిన ధాన్య సేకరణ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆమె, ధాన్య సేకరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. కోవూరు నియోజకవర్గంలో 65,120 ఎకరాల్లో వరి సాగు జరిగిందని, దాదాపు 2.21 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినప్పటికీ, మార్చి 29 నాటికి రైతు సేవా కేంద్రాల ద్వారా కేవలం 20,775 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మిల్లర్ల సహకారం లేకపోవడంతో లక్ష టన్నులకు పైగా ధాన్యాన్ని రైతులు బయట అమ్ముకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కోసిన వెంటనే 21 శాతం తేమ వస్తోందని, రెండు మూడు రోజులు ఆరబెట్టినా కూడా తేమ ఎక్కువగా చూపిస్తూ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. 850 కిలోలకు అదనంగా మరో 100 కిలోలు అడగడం దారుణమని, అటువంటి మిల్లర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని 42 కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచుల కొరత తీవ్రంగా ఉందని, అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు సరిపడా టార్పాలిన్లు, ధాన్యం ఆరబెట్టుకునేందుకు కల్లాలు లేవని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మిల్లులకు ధాన్యం తరలించడానికి తగినన్ని వాహనాలు లేక రైతులు కల్లాల్లోనే నిరీక్షిస్తున్నారని, రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు రైతులకు మిల్లర్లను ఎంపిక చేసుకునే అవకాశాలపై సరైన అవగాహన కల్పించడం లేదని, అధికారుల తీరు మారాలని అన్నారు. కోవూరు నియోజకవర్గంలోని 42 కొనుగోలు కేంద్రాలకు సరిపడా గోనె సంచులు, టార్పాలిన్ల కొరతపై మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అవసరమైతే రబీ సీజన్ ధాన్య సేకరణ గడువును పెంచి ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చూడాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోరారు. ఆమె సూచనలపై జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణ రెడ్డి సానుకూలంగా స్పందించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డి, మార్కెటింగ్ మరియు పౌరసరఫరాల శాఖల అధికారులు పాల్గొన్నారు.








