
సమస్య కోసం పోరాటం చేసి విజయం సాధించిన జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్
రహదారులకు మరమ్మత్తులు చేయాలనే డిమాండ్ తో ప్రత్యేక ఆర్థిక మండలి ( సెజ్ ) కేంద్రంలో జనసేన ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్ సుందరపు విజయ్ కుమార్ చేపట్టిన దీక్ష శుక్రవారం విరమించారు. గురువారం ఉదయం ఆయన అచ్యుతాపురం కూడలిలో మెరుపు ఆందోళనకు దిగారు. పనులు ప్రారంభించే వరకూ కదిలేది లేదంటూ రాత్రంతా కూడలిలోనే కూర్చుండిపోయి ఆందోళన కొనసాగించారు. శుక్రవారం సాయంత్రం ఆర్ అండ్ బీ ఎస్సై కేశవరావు, ఎలమంచిలి డీఈ విద్యాసాగర్ అచ్యుతపురానికి వచ్చి ఆయనతో చర్చించారు. ముందుగా అచ్యుతాపురం – రామన్నపాలెం రోడ్డులో మరమ్మత్తులు చేపట్టడానికి జేసిబిని రప్పించిన అధికారులు పనులు లాంఛనంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. సెజ్ కంపెనీలు, పోలీసులు, ఏపీఐఐసీ అధికారులతో సోమవారం ఏర్పాటు చేసి మిగిలిన ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి కార్యచరణ రూపొందిస్తామని అధికారులు ప్రకటించారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రాజాన సన్యాసి నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు అగ్గాల హనుమంతరావు సంఘీభావంగా దీక్ష కొనసాగించారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా పవన్ కళ్యాణ్, చంద్రబాబులను విమర్శించడం మాని వేలాదిమంది ఉద్యోగులు తిరిగే రోడ్లు బాగు చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. అంతకముందు జనసేన నాయకులు కోన తాతారావు గారు దీక్ష చేస్తున్న సుందరపు విజయ్ కుమార్ గారిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం సమస్య వచ్చినా ముందుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు.








