జనస్వరం కథనానికి స్పందన… సంకుపాలెం–కరకాం రహదారి పనులకు ఆమోదం

చీపురుపల్లి, మార్చి 3, (జనస్వరం) : చీపురుపల్లి మండలంలోని సంకుపాలెం–కరకాం గ్రామాల మీదుగా పెరిపి రోడ్ నుంచి సి.ఎల్. రోడ్ వరకు సుమారు 3.53 కిలోమీటర్ల రహదారి దుస్థితిపై జనస్వరం ప్రచురించిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఈ రహదారి అభివృద్ధి కోసం స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావును కలిసి సమస్యను వివరించారు. గత ప్రభుత్వ కాలంలో రహదారిని త్రవ్వి పనులు మధ్యలోనే నిలిపివేయడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వం రహదారి పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రోడ్ & రైల్వేస్ స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ (APRRSP – SAASCI) పథకం కింద జి.ఓ. ఆర్.టి నెం.64, తేదీ 04-02-2026 ప్రకారం ఈ పనులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం రూ.1.45 కోట్లు వ్యయంతో రహదారి పునర్నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం పనుల అంచనాలు సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతుండగా, అవి పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రామస్తులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

See also  గుంకాలాంలో పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన వారికి ఇళ్ళ పట్టాలు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్న వాలంటీర్లు