
కాకినాడ, ఫిబ్రవరి 20, (జనస్వరం) : ఇంటింటికి వెళ్లి జనసేన సభ్యత్వ నమోదు చేయించాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు శనివారం పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభమైన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. పిఠాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వెన్న జగదీష్ అధ్యక్షతన సాధక్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ప్రతి సాధక్ సభ్యుడు సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగంగా చేపట్టి పార్టీ పురోగతికి కృషి చేయాలని కోరారు. సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరికీ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు వివరించి అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో పైమన్ కమిటీ సభ్యులు పెండం దొరబాబు, ఓదురి కిషోర్ మాట్లాడారు. కార్యక్రమంలో పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకాపల్లి దేవి సూర్యప్రకాష్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.








