
శెట్టూరు, ఫిబ్రవరి 11, (జనస్వరం) : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజా ప్రతినిధుల పిలుపుతో అధికారులు ముందుకు రావడం శెట్టూరు మండలంలో ఆదర్శంగా నిలిచింది. కళ్యాణదుర్గం శాసనసభ్యుడు అమిలినేని సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ శెట్టూరు మండల విద్యాశాఖ అధికారి వి.శ్రీధర్ మాకొడికి ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం రూ.21,116 విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన స్వయంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులకు అందజేశారు. పాఠశాల మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థుల సౌకర్యాల కోసం ఈ నిధులను వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే సురేంద్ర బాబు విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న కృషి తనను ప్రభావితం చేసిందన్నారు. పాఠశాలల బలోపేతం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక అధికారిగా బాధ్యతలతో పాటు సామాజిక స్పృహతో ఈ సహాయం అందిస్తున్నానని తెలిపారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు శ్రీధర్ చర్యను అభినందిస్తూ, ఇలాంటి చర్యలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.








