
డెంకాడ మండలం, జనవరి 12, (జనస్వరం) : డెంకాడ మండలం చోళంగిపేట పంచాయతీ పరిధిలోని పోతయ్య పాలెం గ్రామానికి చెందిన పలువురు రాజకీయ నేతలు శనివారం జనసేన పార్టీలో చేరారు. నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి వారి సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించబడింది. పార్టీలో చేరిన నాయకులకు జనసేన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లండ నరసింహులు (వైసీపీ, 5వ వార్డు), బుర శ్రీను (సీనియర్ నాయకులు), తొత్తడి భాస్కరరావు (టీడీపీ, 4వ వార్డు), పిల్ల సంజీవరావు (సీనియర్ నాయకులు), తొత్తడి శేఖర్ (వైసీపీ) తదితరులు జనసేనలో చేరారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి జనసేన సిద్ధాంతాలపై నమ్మకంతో ముందుకు వచ్చిన నాయకులు పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆమె పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, సేవాభావం, అలాగే నెల్లిమర్ల నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటామని వారు స్పష్టం చేశారు.








