చిత్రాడ గ్రామసభలో కూటమి ప్రభుత్వ హామీలు – 125 రోజులు ఉపాధి

పిఠాపురం మండలం, జనవరి 5, (జనస్వరం) : పిఠాపురం మండల పరిధిలోని మేజర్ పంచాయతీ చిత్రాడ గ్రామ సచివాలయంలో “స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ గ్రామ పంచాయితీలు 2026” కార్యక్రమంలో భాగంగా గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామసభలో కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ కొత్తలూరి సునీత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు “వికసిత్ భారత్ – 125 రోజులు గ్రామీణ ఉపాధి హామీ” కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం 100 పని దినాలు మాత్రమే కల్పించడంతో పాటు వేతనాలు సమయానికి జమ కాక ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 100 నుంచి నేరుగా 125 పని దినాలకు పెంచి, ప్రతి వారం వేతనాలు గ్రామీణ ఉపాధి కార్మికుల ఖాతాల్లో జమ అవుతున్నాయని వివరించారు. గ్రామ ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే సచివాలయం ద్వారా తెలియజేయాలని సూచిస్తూ, కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దూలపల్లి రత్నం నాగబాబు, గ్రామ కమిటీ నాయకులు, ఉపాధి హామీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

See also  మహిళలకు రక్షణ కల్పించాలని కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసిన గుంతకల్ జనసేన నాయకులు