
విజయనగరం, అక్టోబర్ 14, (జనస్వరం) : ఉత్తరాంధ్ర జనసేన పార్టీ శాసనసభ్యులతో రాష్ట్ర శాసనమండలి సభ్యుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవిని నాగబాబు శాలువాతో సత్కరించి అభినందించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, పార్టీ బలోపేతం అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి విజయనగరం జిల్లా జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. జిల్లాలో కింది స్థాయి నుంచి అగ్ర నాయకుల వరకు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గాల అభివృద్ధి పనులను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని, పార్టీ ఆశయాలు, ఉద్దేశ్యాలు మరింత బలంగా ప్రజల్లోకి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదును ఉద్యమంలా కొనసాగించాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గాల అభివృద్ధికి శ్రేణులంతా కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కోరారు.








