
సత్తెనపల్లిలోని దేవాలయాల్లో చోరీలు ఇద్దరు దొంగల అరెస్ట్ – సి ఐ నాగమల్లేశ్వరరావు
సత్తెనపల్లి.డిసెంబర్13.( జనస్వరం)
సీసీ కెమెరా ఫుటేజ్, క్లూస్ టీం సహకారంతో కేసు ఛేదించిన పోలీసులు.సత్తెనపల్లి పట్టణంలోని ప్రసిద్ధ వేణుగోపాలస్వామి దేవాలయంతో పాటు శివాలయాల్లో ఇటీవల జరిగిన చోరీ ఘటనలకు సంబంధించి పోలీసులు కేసును ఛేదించారు.ఈ చోరీలకు పాల్పడ్డ గుంటూరు జిల్లాకు చెందిన శివశంకర్ రెడ్డి,ఫణి కృష్ణ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులలో ఒకరు మైనర్గా గుర్తించారు.
దేవాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ ను నిశితంగా పరిశీలించడంతో పాటు, క్లూస్ టీం సేకరించిన ఆధారాల ఆధారంగా పోలీసులు దుండగుల జాడను గుర్తించి, ప్రత్యేక బృందాలతో వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.34,000 నగదు, చోరీకి ఉపయోగించిన కటింగ్ మిషన్,ఒక బైక్,ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.దేవాలయాల్లో భక్తుల కానుకలు,హుండీల లోని నగదును లక్ష్యంగా చేసుకొని ఈ చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు సీఐ నాగమల్లేశ్వరరావు అతని సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.దేవాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం అందించాలని పోలీసులు కోరారు.








