బిగ్ అలెర్ట్ … ఓటర్లూ బహు పరాక్ …!

– ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి ఇవ్వాల్సిందే …!!

శంఖవరం, నవంబర్ 22 (జనస్వరం) : “బిగ్ అలెర్ట్ … ఓటర్లూ బహు పరాక్ …!.‌ ఓటర్లుగా మీ పేర్లు పక్కాగా నమోదై ఉన్నా, ఇప్పటికే పలు ఎన్నికల్లో మీరు మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నా తాజాగా మీరు ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి ఇవ్వాల్సిందే. ఈ ప్రక్రియను పూర్తి చేయకుంటే కాస్త ఇబ్బందే.‌ అదేమంటే మీరు ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి మీ ప్రాంతం ఎన్నికల అధికారులకు సమర్పించకుంటే మీ ఓటు హక్కు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ఓటర్ల జాబితాలను ఏవిధమైన తప్పులు లేకుండా 100 శాతం పూర్తి ఖచ్చితత్వంతో రూపొందించాలని శంఖవరం మండల తహసీల్దార్ అల్లాడి తాతారావు పేర్కొన్నారు.‌ ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా ఉండేలా సరి చూసేందుకు, సరి చేసేందుకు, దిద్దుబాట్లు, మార్పులు, చేర్పులు చేసేందుకు భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి తనిఖీ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం చక్కగా ఉపయోగ పడుతుందని ఆయన వివరించారు.‌ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని తాహసిల్దార్ కార్యాలయంలో ఓటర్ల మ్యాపింగ్ గురించి ఎలక్షన్ సూపర్వైజర్లకు, బూత్ లెవెల్ అధికారులు అందరికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – 2026 కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. దీనిలో మిగతా సిబ్బందికి తాతారావు మార్గనిర్దేశం చేశారు. సాధారణంగా ఏటా స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది. అందులో కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారి పేర్లను విధిగా తొలగించడం, చిరునామా మార్పు వంటివి చేస్తామని, అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దానికంటే చాలా విస్తృత మైనదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటినీ సందర్శించి, ఇంటింటిలోని అన్ని ఓట్లనూ విధిగా తనిఖీ చేయాలనీ, ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలను సేకరించి, ధృవీకరించాలని ఆయన ఆదేశించారు. ఓటర్ల జాబితాలోని పేర్లు యధావిధిగా కొనసాగాలంటే ప్రస్తుతం ఉన్న ప్రతీ ఓటరు నుండి ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి, ఎన్నికల బూత్ లెవెల్ అధికారులు తీసుకోవాలని. ఈ ప్రక్రియలో ప్రతీ ఓటరు పేరునూ ఆ రాష్ట్రంలో గతంలో జరిగిన చివరి ఇంటెన్సివ్ రివిజన్ నాటి ఓటరు జాబితాతో లింక్ చేయాలని, పాత జాబితాలతో ఓటర్ల పేర్లు, తల్లి, దండ్రులు, బంధువుల పేర్లు లింక్ చేయాలనీ, అలా లింక్ కాని పక్షంలో ఓటరు పౌరసత్వాన్ని, వయస్సును, నివాసాన్ని నిరూపించే అవసరమైన సవివర పత్రాలను ఓటర్ల నుంచి తీసుకోవాలని, నకిలీ, పునరుక్తి నమోదులను, మృతుల పేర్లను తొలగించాలని, అర్హులైన పౌరుల ఎవరి పేర్లనూ ఓటర్ల జాబితా నుంచి మినహాయించకుండా చూడాలని, ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని తాహసిల్దార్ అల్లాడి తాతారావు సవివరంగా ఎన్నికల అధికార్లకు నొక్కి వక్కాణించి చెప్పారు.

See also  అగ్నికుల క్షత్రియులకు జీవన భద్రత కల్పించాలి : అమలాపురం జనసేన నాయకులు