గూడెం గిరిజన గ్రామంలో మొదటిసారి విద్యుత్ వెలుగులు

విశాఖపట్నం, అక్టోబర్ 7, (జనస్వరం) : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న గిరిజన గ్రామం ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు వెలుగుదీనాయి. దశాబ్దాలుగా వెలుతురు లేక జీవిస్తున్న ఈ గిరిపుత్రుల జీవితాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో వెలుగులు నిండాయి. సుమారు 50 కిలోమీటర్ల దూరంలో అడవులు, కొండలు నడుమ ఉన్న ఈ గ్రామంలో 17 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామస్థులు గతంలో ఎన్నోసార్లు అధికారులకు తమ సమస్యలు తెలియజేసినా స్పందన లేకపోవడంతో బాధపడుతున్నారు. ఐదు నెలల క్రితం తమ ఇళ్లలో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్‌ను గూడెం గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. వారి సమస్యను ఆయన వెంటనే జిల్లా కలెక్టర్‌కు తెలియజేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు గ్రామానికి విద్యుత్ సరఫరా చేయాలంటే దాదాపు 9.6 కిలోమీటర్ల దూరం వరకు విద్యుత్ లైన్ వేయాల్సి ఉంటుందని తెలిపారు.

అందుకోసం 217 విద్యుత్ స్తంభాలను కొండచరియలు, శిఖరాలు దాటి మానవ వనరుల సాయంతో రవాణా చేసి, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనులు పూర్తి చేశారు. మొత్తం రూ.80 లక్షల పైగా అంచనా వ్యయంతో విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయగా, ప్రత్యామ్నాయ చర్యగా సోలార్ ప్యానెల్లు, ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ కూడా అమర్చారు. కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం, పీఎం జన్మన్ పథకాల ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించడంతో ఈ పనులు వేగవంతంగా పూర్తయ్యాయి. గ్రామంలోని ప్రతి ఇంటికి ఐదు బల్బులు, ఒక ఫ్యాన్‌ను ప్రభుత్వం అందించింది. గూడెం గ్రామం వంటి గిరి శిఖర ప్రాంతంలో ఈ తరహా హైబ్రిడ్ విద్యుత్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం ఉంచిన గిరిజనులకు అభినందనలు తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి రవి కుమార్, ఏపీసీపీఎల్ అధికారులు, విద్యుత్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ వెలుగులు వెలిగిన బుధవారం గూడెం గ్రామం పండగ వాతావరణంలో మునిగిపోయింది. రాత్రివేళల్లో చీకటిలో భయంతో గడిపిన గ్రామస్తులు ఆనందంతో కళ్లు చెమర్చుకున్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, అరకు జనసేన నాయకులు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో కలిసి ఆనందం పంచుకున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో వారు ట్రాక్టర్‌పై ప్రయాణించి చేరుకోవడం విశేషం.

See also  చిందేపల్లి గ్రామస్థులతో కలిసి ఆర్.డి.ఓ గారికి జనసేనపార్టీ తరుపున వినతి అందించిన వినుతా కోట