చింతపల్లిలో తుఫాను ప్రభావం పరిశీలించిన ప్రజా ప్రతినిధులు

    పూసపాటి రేగ, అక్టోబర్ 29, (జనస్వరం) : ‘మోంథా’ తుఫాను ప్రభావం నేపథ్యంలో తీరప్రాంత ప్రజల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఈరోజు పూసపాటి రేగ మండలంలోని చింతపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ  సందర్భంగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కళిశెట్టి అప్పల నాయుడు, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, మండల తహసీల్దార్ (MRO), ఎంపీడీఓ, ఇతర శాఖాధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు ఆమెతో కలిసి పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, వారి అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద నష్టం జరగలేదని, అధికారులు సమర్థవంతంగా పని చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. “ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండే వరకు యంత్రాంగం క్షేత్రస్థాయిలో కృషి కొనసాగిస్తుంది” అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తుఫాను కారణంగా నష్టపోయిన వ్యవసాయ భూములు, ఇళ్లను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

See also  ప్రజా అభిప్రాయం మేరకు వాటర్ ట్యాంక్ నిర్మించాలి