కల్వకుర్తి వద్ద బీసీ బంద్‌కు మద్దతు – 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యం

       కల్వకుర్తి, అక్టోబర్ 19, జనస్వరం : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ బంద్‌కు మద్దతుగా కల్వకుర్తి TGRTC డిపో వద్ద బీసీ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా సమావేశం నిర్వహించారు. బీసీ వర్గాల 42% రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా ఈ బంద్ చేపట్టినట్లు నాయకులు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ అచంపేట నియోజకవర్గ బీసీ యువ నాయకుడు అల్లే జగదీశ్వర్ మాట్లాడుతూ, “75 సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చినా మన హక్కుల కోసం ఇంకా పోరాటం కొనసాగుతోంది. నూటికి 60% జనాభా ఉన్న మన బీసీ వర్గాలు రిజర్వేషన్ కోసం పోరాడుతున్న పరిస్థితి సిగ్గుచేటు” అని అన్నారు. ఆయన మాట్లాడుతూ, “ఆ నాడు మన పెద్దలకు రిజర్వేషన్‌పై అవగాహన లేకపోయినా, ఈ రోజు ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు. ఇప్పుడు మన హక్కుల కోసం మనమే పోరాడాల్సిన సమయం వచ్చింది. ఐక్యతతో ముందుకు సాగి, మన వాటా సాధించే వరకు ఈ పోరాటం ఆగకూడదు” అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు “జై బీసీ – జై జై బీసీ” నినాదాలతో మార్మోగించారు. బీసీ వర్గాలకు సరైన హక్కులు, రాజకీయ ప్రాధాన్యం రావాలన్న డిమాండ్‌తో బంద్ కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది. సమావేశంలో పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు, యువత, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  నూతన సంవత్సర సందర్భంగా మూసాపేట్ డివిజన్ జనసైనికుల ఆధ్వర్యంలో 100 మందికి దుప్పట్లు పంపిణీ