
ఆయన పేరు బండి పవన్ కళ్యాణ్ — కళ అంటే జీవం, సృజన అంటే శ్వాస. ఒకవైపు ప్రతిభావంతుడైన ఫోటోగ్రాఫర్, మరోవైపు అన్ని మాధ్యమాలలో చిత్రాలు వేస్తున్న పెయింటర్, అదే సమయంలో టెంపుల్ ఆర్కిటెక్చర్, ఇండియన్ కల్చర్, తోలు బొమ్మలాట వంటి ప్రాచీన కళారూపాలపై పరిశోధన చేస్తున్న అధ్యయనశీలి. కళను కేవలం అభిరుచిగా కాకుండా జీవిత భాగంగా మలుచుకున్న పవన్ కళ్యాణ్, ఈ తరం యువ కళాకారులకు స్ఫూర్తి.
బాల్యం – విద్యాభ్యాసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, అనంతపురం మండలంలోని కందుకూరు అనే పల్లెటూరిలో బండి సువర్ణ – చంద్ర దంపతుల గృహంలో పవన్ కళ్యాణ్ జన్మించాడు. చిన్నతనంలోనే ఆయనలోని సృజనాత్మకత ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షించింది. తమ్ముడు ఉదయ్ కుమార్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ తన విద్యను కందుకూరు ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసి, అనంతరం శ్రీ వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. కళపై మక్కువతో 2016లో బి.ఎస్.సీ (స్టాటిస్టిక్స్) చేశాడు. అయితే మనసు మాత్రం గణాంకాల్లో కాదు, రంగుల్లో తేలియాడుతోంది. అందుకే 2019లో యోగి వేమన యూనివర్సిటీ, కడప లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (పెయింటింగ్) కోర్సులో అడుగుపెట్టాడు.
ఫోటోగ్రఫీ – కాంతి నీడల లోకం
డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కెమెరా కంటిలో కొత్త ప్రపంచాన్ని చూశాడు. మధ్యాహ్న వేళల్లో స్థానిక ఫోటో స్టూడియోలో పని చేస్తూ ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. కొంతకాలం పార్లే బిస్కెట్ కంపెనీలో కూడా పనిచేశాడు. తర్వాత యూనివర్సిటీలో ఫోటోగ్రఫీ కోర్సు కోసం దరఖాస్తు చేసినా, అక్కడ ఆ కోర్సు లేకపోవడంతో పెయింటింగ్ విభాగంలో చేరాడు. అయినప్పటికీ ఆయన ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువ తగ్గలేదు. ఆలయ నిర్మాణ శైలులు, భారతీయ సంస్కృతి, తోలు బొమ్మలాట వంటి సంప్రదాయ కళారూపాలను ఫోటోల్లో బంధిస్తూ తన దారిని ఆయన కొనసాగించాడు. 2023లో జరిగిన జాతీయ యువజన ఉత్సవంలో ఫోటోగ్రఫీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిభను నిరూపించాడు.
పెయింటింగ్ – రంగుల సంభాషణ
ఎప్పుడూ పెయింటింగ్ చేయని పవన్ కళ్యాణ్, కళాశాలలో అడుగుపెట్టిన తర్వాతే రంగులతో స్నేహం మొదలుపెట్టాడు. వాటర్ కలర్తో మొదలైన ప్రయాణం, తరువాత పోస్టర్ కలర్, యాక్రిలిక్ వంటి మాధ్యమాల్లో విస్తరించింది. ఇప్పటివరకు 500కు పైగా చిత్రాలు వేశాడు — ప్రతి చిత్రంలోనూ ఒక భావం, ఒక సందేశం, ఒక మానవతా స్పర్శ కనిపిస్తుంది. తన చిత్రాలు చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించగా, అనేక పురస్కారాలు కూడా ఆయన కీర్తిపథంలో చేరాయి.
టెంపుల్ ఆర్కిటెక్చర్ & తోలు బొమ్మలాట
భారతీయ దేవాలయ నిర్మాణ శైలులు, శిల్పాలు, ప్రతిమల వెనుక ఉన్న కళా గాథలు పవన్ కళ్యాణ్ను ఆకట్టుకున్నాయి. ప్రాచీన కళారూపాలు మరుగునపడిపోకుండా వాటి వైభవాన్ని ఫోటోలు, చిత్రాల రూపంలో నిలుపుతున్నారు. ఇటీవల ఆయన అనంతపురం జిల్లాలో అంతరించి పోతున్న తోలు బొమ్మలాట కళను పునరుద్ధరించేందుకు పరిశోధన చేస్తున్నారు. ఈ కృషి ఆయనను కేవలం కళాకారుడిగానే కాకుండా సంస్కృతి పరిరక్షకుడిగా నిలబెడుతోంది.
పురస్కారాలు – కృషికి గౌరవం
- 2019: సి.పి. బ్రౌన్ వారోత్సవాల్లో చిత్రలేఖన పోటీలో మొదటి స్థానం.
- 2022: యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యువ ఉత్సవ్ యువ కళాకారుల అవార్డు.
- 2023: 36వ ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్లో స్పాట్ ఫోటోగ్రఫీ – రజత పతకం.
- 2023: 36వ ఇంటర్ యూనివర్సిటీ నేషనల్ యూత్ ఫెస్టివల్లో స్పాట్ ఫోటోగ్రఫీ – గోల్డ్ మెడల్.
- 2024: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక ఉపాధ్యాయ అవార్డు.
- 2025: జాతీయ ఆపరేషన్ సింధూర్ పెయింటింగ్ పోటీలో బంగారు పతకం.
- 2025: నేషనల్ గోల్డెన్ బ్రేస్ ఆర్టిస్ట్ బిరుదు.
బండి పవన్ కళ్యాణ్ – యువతకు స్ఫూర్తి
కాలేజీ రోజులలో మొదలైన ఈ ప్రయాణం, నేటికి ఒక గొప్ప కళాసాగరంగా మారింది. ఉద్యోగం చేస్తూనే, తన సమయాన్ని కళ, సంస్కృతి, అధ్యయనానికి అంకితం చేస్తున్న పవన్ కళ్యాణ్ కృషి, నేటి యువతకు ప్రేరణ. కళను నేర్చుకోవడమే కాదు, దానిలో జీవించడం నేర్చుకున్న మనిషి – బండి పవన్ కళ్యాణ్. అతని చిత్రకళా ప్రయాణం ఈ తరం యువ కళాకారులకు మార్గదర్శి అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
– సాకే నరేష్









