
మరొక్క సారి జలమయమైన డాంగే నగర్, కాకాని నగర్, ఆర్ టి సి కాలనీలు పట్టించుకోని అధికారులు : జనసేన పార్టీ
అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే విధిగా జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కారణంగా మరొక్కసారి జగ్గయ్యపేట పట్టణంలో పలు ప్రాంతాలు డాంగే నగర్, కాకని నగర్ లు నీట మునిగి జలమయమైన ప్రాంతాలను ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆయన బృందం తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను మంగళవారం రోజున సమీప షేర్ మొహ్మద్ పేట మరియు మంగోళ్లు గ్రామ చెరువుల కట్టలు తెగిపోవటంతో పలు ప్రాంతాలకు మోకాళ్ళ లోతు వరకు నీరు వచ్చి, ఇళ్లలోకి సైతం నీరు వచ్చిన సంఘటనలు జరిగాయి. వాటిని ఆరోజు అధికారులు, నాయకులు సందర్శించినప్పటికి అవి పునరావృతం కాకుండా చేపట్టే చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారని ఆయన వాపోయారు. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మరలా నీరు వరదలగా వచ్చి చేరడంతో అర్ధరాత్రి సమయంలో వరద నీరు వచ్చి ఇళ్లలోకి చేరడంతో స్థానిక ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. కనీసం ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ముందస్తుగా ఎటువంటి ఎన్ డి ఆర్ ఫ్ బృందాలు కానీ రెస్క్యూ టీం వారు కానీ లేకపోవటం చాలా బాధకరం అని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టి అక్కడ నివసిస్తున్న ప్రజలకి తగిన సౌకర్యాలు కల్పిచాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్, రెహ్మాన్, గోపి, సాయి తదితరులు పాల్గొన్నారు.









