
నరవ కళ్యాణ మండపం ను సాధించుకుందాం : పిలుపునిచ్చిన జనసైనికులు
ప్రజలందరూ వివాహాది శుభకార్యాలు చేసుకునే కళ్యాణ మండపంలో వార్డు సచివాలయం ఏర్పాటు చెయ్యడం పై గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది… దీంతో ప్రజల పక్షాన జనసేన పార్టీ నాయకులు నిలబడి కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిరసన ర్యాలీ చేపట్టారు. 88వ వార్డ్ విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నరవ గ్రామంలో ప్రజలందరికీ ఉపయోగపడే కళ్యాణ మండపంలో వార్డు సచివాలయం ఏర్పాటు చేశారు. దీంతో పెందుర్తి నియోజకవర్గం, జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న కళ్యాణ మండపం వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో ధర్నా, నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామంలో ఉన్న కళ్యాణ మండపాన్ని స్థానిక అధికార పార్టీ నేతలు ప్రజల అనుమతి లేకుండా స్వాధీనం చేసుకుని సచివాలయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఏడాదిన్నర కావస్తున్నా ఈ మండపాన్ని ఖాళీ చేయకపోవడం వల్ల ప్రజలు వివాహాది శుభకార్యాలు చెయ్యలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జనసేన అపార్టీ నాయకులు పిన్నింటి వరలక్ష్మి, శ్రీనివాసరావు, బోబ్బరి శీను, బొడ్డి నాయుడు, గావర శ్రీను, రవి, ప్రవీణ్, వెంకటేష్, వీర మహిళలు పలువురు జనసైనికులు పాల్గొన్నారు.









