రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ

     ఆత్మకూరు, (జనస్వరం) : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మున్సిపల్ బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం స్థానిక ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలు తర్వాత అత్యధికంగా వరి పండించే జిల్లా నెల్లూరు జిల్లా అని పేర్కొన్నారు. నారు పోసిన దగ్గర నుండి కుప్ప నూర్చే వరకు రైతన్నల కష్టాలు వర్ణనాతీతం. ఆకాశాన్నంటిన ఎరువుల ధరలు, తడిసి మోపెడైన వ్యవసాయ ఖర్చులు, ఇవి చాలవన్నట్టు రైతన్న వెన్ను విరుస్తూ అకాల వర్షాల వంటి ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతా కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కన్నా తక్కువగా కొనుగోలు చేస్తున్న దళారులు, మిల్లర్ల దోపిడీ ఒకపక్క రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, అయ్యా మేము పండించిన ధాన్యాన్ని మొత్తం మీరు ప్రకటించిన ధరకే, ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలన్న, అన్నదాతల ఆక్రందనను ఆలకించ వలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా రైతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతన్న పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి యువకుడు పని చేయాలి